రాయచోటి నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి సేవలు మరువలేనివని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.బి. అంజాద్ బాషా అన్నారు. వెలిగల్లు ప్రాజెక్టు నుంచి గాలివీడు రాయచోటి మండలాల్లోని చెరువులకు ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని నింపే పనులకు భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ గతంలో రాయచోటి నియోజకవర్గ అభివృద్ధి గురించి ఎవరూ పట్టించుకోక పోవడంతో నిర్లక్ష్యానికి గురైందని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వెలిగల్లు ప్రాజెక్టును నిర్మించారని గుర్తు చేశారు. ఆయన మరణానంతరం వెలిగల్లు ప్రాజెక్టు అభివృద్ధి మరిచారన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి వెలిగల్లు ప్రాజెక్టు అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి గండికోట ప్రాజెక్టు నుంచి వెలిగల్లు ప్రాజెక్టు కు నీటిని చెప్పించారన్నారు. రాయచోటి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రస్తుతం రాయచోటి, గాలివీడు మండలాలలోని చెరువులకు నీటిని నింపి తాగు సాగు నీటి సమస్యను పరిష్కరించడం జరుగుతుందన్నారు.
ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాట్లాడి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని, ఆయన సేవలు మరువలేనిదన్నారు.
రాయచోటి నియోజకవర్గ ప్రాంతంలో శాశ్వత తాగు సాగు నీటి సమస్య పరిష్కరించేందుకు నేడు 9456 లక్షల రూపాయలతో వెలిగల్లు జలాశయం ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయడం జరిగిందని, రాబోయే రోజుల్లో రాయచోటి నియోజకవర్గంలో ఇంటింటికి మంచి నీటి కుళాయి ఏర్పాటు చేసి శాశ్వత నీటి సమస్య పరిష్కరించడం జరుగుతుందన్నారు. రాయచోటి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేయడం జరుగుతుందని ఇందుకు ప్రజలు కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
కార్యక్రమంలో నీటిపారుదల ఈఈ మధుసూదన్ రెడ్డి, డీఈ జనార్ధన్ రెడ్డి, లక్కిరెడ్డిపల్లె మార్కెట్ యార్డ్ చైర్మన్ సునీత, మాజీ జెడ్పిటిసి సుదర్శన్ రెడ్డి, యదుభూషణ రెడ్డి, కడప 30 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి షఫీ, ఆవుల భూషణ్ రెడ్డి, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.