Sunday, May 12, 2024

పున్నమి రాత్రివేళ.. ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం

దేశంలో అన్ని దేవాలయాల్లో సీతారాముల కళ్యాణం చైత్ర మాసం నవమి రోజున పగలు జరిగితే.. ఒంటిమిట్టలో మాత్రం రాత్రి జరుగనుంది. చైత్ర మాస పౌర్ణమి రోజున సీతారాముల కళ్యాణం జరిపించనున్నారు. శ్రీరామ నవమి ముందు రోజు నుంచి 11రోజుల పాటు ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. పౌర్ణమిరోజు రాత్రి స్వామివారి కల్యాణం ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం కోదండ రామస్వామికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనుంది.

కోదండ రామాలయం ఆలయం ప్రత్యేకత

ఈ ఆలయంలోని గర్భగుడిలో పూజలను అందుకుంటున్న సీతా రామలక్ష్మణులు ఏక శిలా నిర్మితాలు. రామ భక్తుడు ఆంజనేయ స్వామి గర్భగుడిలో కాకుండా ప్రత్యేకంగా సంజీవరాయుడుగా కొలువై ఉన్నాడు. ప్రతి ఏడాది శ్రీరామనవమి సందర్భంగా తెలుగునాట శ్రీ సీతారాముల కల్యాణ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. రామలయాలలోనే కాకుండా ఇళ్లలోను భక్తిశ్రద్ధలతో ఈకల్యాణ ఘట్టాన్ని కన్నులపండువగా నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆనవాయితీకి పునాది.. భద్రాచలంలో ఏర్పడిందనేది శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో మరో రామక్షేత్రమైన ఒంటిమిట్టలో దీనికి కాస్త విభిన్నమైన సంప్రదాయం కనిపిస్తుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా చతుర్దశినాటి రాత్రి రాములోరి కల్యాణం జరుగుతుంది. ఆ ఒంటిమిట్ట గురించి చెప్పుకోవడం మొదలుపెడితే చాలా విశేషాలే వినిపిస్తాయి.

రాముడు అయోధ్యాపురిలో జన్మించినా వనవాసంలో భాగంగా దక్షిణాది వైపు ప్రయాణం చేశారని అంటారు. అందుకే శ్రీలంక వరకూ దక్షిణభారతం పొడవునా రామాయణ ఘట్టాలకి సంబంధించిన క్షేత్రాలు కనిపిస్తూ ఉంటాయి. వాటిలో ఒంటిమిట్ట కూడా ఒకటి. ఒంటిమిట్టకు ఏకశిలా నగరం అన్న పేరు ఉంది. ఆ ఏకశిలకు దగ్గర్లోనే మృకండుడు అనే మహర్షి తపస్సు చేసుకునేవారట. రాములవారు అరణ్యవాసంలో భాగంగా అటు సంచరిస్తూ కొద్ది రోజులు మృకండునికి రక్షణగా ఇక్కడ ఉన్నారని స్థలపురాణం చెబుతోంది.
రాములవారు ఇక్కడ నిలిచిన సమయంలోనే సీతాదేవికి విపరీతమైన దప్పిక కలిగిందట. అప్పుడు రామచంద్రుడు తన బాణాన్ని పాతాళంలోకి సంధించగా… మంచినీట ఊరిందని చెబుతారు. అదే ఈనాడు రామతీర్థంగా పిలుచుకునే చెరువని, రాములవారు నిలబడిన చోటే కోదండరామాలయాన్ని నిర్మించారని భక్తుల నమ్మకం. ఏకశిలకీ రామునికీ మధ్యగల అనుబంధం గురించి విజయనగర రాజులకు తెలియడంతో…. ఒంటడు, మిట్టడు అనే స్థానిక బోయల సాయంతో ఇక్కడ ఆలయాన్ని నిర్మింపచేశారట. అందుకనే ఈ ఆలయానికి ఒంటిమిట్ట రామాలయం అన్న పేరు స్థిరపడిందంటారు.

ఒంటిమిట్ట ఆలయంలోని సీతారామలక్ష్మణుల విగ్రహాలు మూడూ ఒకటే శిలలో చెక్కడం విశేషం. ప్రతి రామాలయంలోనూ కనిపించే ఆంజనేయస్వామి విగ్రహం ఈ ఆలయంలో కానరాకపోవడం మరో విచిత్రం. రాములవారు ఆంజనేయుని కలవక ముందే ఇక్కడకు వచ్చారనీ… అందుకే ఇక్కడ హనుమంతుని విగ్రహం ఉండదని చెబుతుంటారు. శతాబ్దాలుగా ఒంటిమిట్ట రామాలయం భక్తులకు పుణ్యతీర్థంగా ఉండేది. పోతన సైతం ఇక్కడే భాగవతాన్ని అనువదించాడనీ, అన్నమయ్య కూడా ఈ క్షేత్రాన్ని దర్శించాడనీ చెబుతారు. ‘ఇందులోనే కానవద్దా ఇతడు దైవమని/ విందువలె నొంటిమిట్ట వీర రఘురాముని’ అంటూ అన్నమాచార్య కీర్తనల్లో ఒంటిమిట్ట రాముని కనిపిస్తుంది.

ఇక్కడ చెప్పుకొన్న విశేషాలన్నీ ఒక ఎత్తయితే… శ్రీరామనవమి సందర్భంగా చతుర్దశి రాత్రివేళ కల్యాణాన్ని నిర్వహించడం ఒక ఎత్తు. పగటివేళ తాను రామకల్యాణాన్ని చూడలేకపోతున్నానని బాధపడుతున్న చంద్రుని ఊరడించేందుకు, రాములవారు ఇక్కడ రాత్రివేళ కల్యాణం జరిగేలా వరాన్ని ఒసగారని ఒక గాథ ప్రచారంలో ఉంది. మరో కథ ప్రకారం చంద్రవంశజులైన విజయనగరరాజులు తమ కులదైవానికి తృప్తికలిగేలా… రాత్రివేళ కల్యాణాన్ని జరిపించే ఆచారాన్ని మొదలుపెట్టారని చెబుతారు.

ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం రాత్రే ఎందుకు జరుగుతుంది

చారిత్రాత్మక నేపధ్యం ఉన్న కోందండరామ స్వామీ ఆలయంలో స్వామి ఆలయంలో పున్నమి వెన్నెలలో కళ్యాణం జరగడానికి పురాణాల్లో ఒక కథనం ఉంది. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి వివాహం పగటి సమయంలో జరుగుతుంది. తాను అక్క లక్ష్మీదేవి పెళ్లిని చూడలేక పోతున్నానని చంద్రుడి విష్ణుమూర్తికి చెప్పడంతో.. నీ కోరిక రామావతారంలో తీరుతుందని విష్ణుమూర్తి చంద్రుడికి వరమిస్తాడు. అందుకే ఈ ఆలయంలో నవమి రోజు కాకుండా చైత్రశుద్ధ పౌర్ణమి నాడు నిండు పున్నమి వెన్నెల సాక్షిగా సీత రాముడి వివాహం వేడుక జరుగుతుంది.
కారణం ఏదైనా ఇతర రామాలయాలకు భిన్నంగా ఒంటిమిట్టలో రాములోరి కల్యాణం చతుర్దశి నాటి రాత్రి, పౌర్ణమి రోజున రథోత్సవం ఘనంగా జరుగుతాయి. సమైక్యాంధ్ర విడిపోయాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. ఒంటిమిట్టకు రాష్ట్ర ప్రభుత్వం మరింత ప్రాధాన్యతను ఇస్తోంది. 2015 నుంచి ప్రభుత్వ లాంఛనాలతో, టీటీడీ ఆధ్వర్యంలో సీతారాముల కల్యానోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.

ఈ ఏడాది ఏప్రిల్‌ 16 నుంచి ప్రారంభమైన కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు.. ఏప్రిల్ 26వతేదీతో ముగుస్తాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular